హుజూరాబాద్/ ఏప్రిల్ 08 (మా అక్షరం):
జనావాసాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్సఫర్ (DBFOT) విధానంలో ప్రైవేట్ సంస్థకు అప్పగించి ప్రభుత్వం చేపట్టిన డంపింగ్ యార్డు ప్రతిపాదనకు వ్యతిరేకంగా హుజూరాబాద్లో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి.ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలతో కలిసి నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షను బుధవారం రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మహిళలతో కలిసి పండ్ల రసం అందించి విరమింపజేశారు.ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ,గత 17 రోజులుగా ప్రజలు విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేసి వారం రోజుల్లో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.అలా చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.













