హుజురాబాద్/ ఏప్రిల్ 09(మా అక్షరం): సిర్సపల్లి గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ ని రద్దు చేయాలని పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరాన్ని గురువారం హుజరాబాద్ న్యాయవాదులు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసరి శేషయ్య నాయకత్వంలో వారు కోర్టు నుండి నిరసన శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం న్యాయబద్ధమైనదని, అదేవిధంగా డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తాము డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తామని, అందుకు అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయబద్ధమైన రక్షణ కోసం కృషి చేస్తామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీలకతీతంగా ఐక్యమై డంపింగ్ యార్డు రద్దు చేసేలా ప్రయత్నించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.













