-విగ్రహావిష్కరణకు భారీ జనసందోహం…
కరీంనగర్/ ఏప్రిల్ 09 (మా అక్షరం):కీ.శే. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు అమోఘమని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.మానేరు బ్రిడ్జి సమీపంలోని తీగల వంతెన కూడలిలో ఏర్పాటు చేసిన దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు హాజరయ్యారు.అనంతరం లక్ష్మీనరసింహ గార్డెన్లో నిర్వహించిన వర్ధంతి సభలో పోలాడి రామారావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున కమలాపూర్ ప్రాంతం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదర్ రెడ్డి, ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు కేబినెట్లలో యువజన సేవలు, పర్యాటకం, గనులు, రవాణా, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారని తెలిపారు.ప్రత్యేకంగా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన, ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పర్యవేక్షించారని గుర్తుచేశారు. హుజురాబాద్, కమలాపూర్, మానకొండూర్ నియోజకవర్గాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించారని చెప్పారు.ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బలహీన వర్గాలకు ఇండ్ల స్థలాలు కేటాయించి సామూహిక గృహనిర్మాణానికి దోహదం చేశారని కొనియాడారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన సామాజిక న్యాయవాదిగా దామోదర్ రెడ్డి గుర్తింపు పొందారని పేర్కొన్నారు.1956 జూలై 20న జన్మించిన దామోదర్ రెడ్డి 2012 ఏప్రిల్ 9న కన్నుమూయడం బాధాకరమని, ఆయన ఆశయాలను ఆచరించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకావడం విశేషంగా నిలిచింది.













