హుజురాబాద్/ ఏప్రిల్ 16 (మా అక్షరం): డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హుజురాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఎనర్జీ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ దీక్షలో జూపాక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా జూపాక గ్రామ సర్పంచ్ తాల్లపెల్లి స్వప్న మాట్లాడుతూ…“చెత్త ఉత్పత్తి అభివృద్ధి కాదు, వినాశనం” అని అన్నారు. హుజురాబాద్ పరిధిలో సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్’ ఏర్పాటుతో ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డు వల్ల కాలుష్యం పెరిగి,భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల చెత్తను హుజురాబాద్కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు.ఈ ప్లాంట్ను “వేస్ట్ టు ఎనర్జీ” కాకుండా “వేస్ట్ టు హుజురాబాద్ డిస్టర్బ్ ప్లాంట్”గా అభివర్ణిస్తూ దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం సురక్షిత తాగునీరు, సాగునీరు అందించకుండా ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు.డంపింగ్ యార్డును వెంటనే ఈ నియోజకవర్గం నుంచి తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జూపాక గ్రామ పంచాయతీ పాలకవర్గం డిమాండ్ చేసింది. దీక్ష అనంతరం తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాల్లపెల్లి స్వప్న, ఉపసర్పంచ్ మహేందర్ జీ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












