-డంపింగ్ యార్డ్ నిర్ణయంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం…
హైదరాబాద్/ హుజురాబాద్, ఏప్రిల్ 17 (మా అక్షరం): హుజురాబాద్లో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్య అని అన్నారు.డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపారు. వ్యవసాయం నాశనం అవుతుందని, తాగునీరు కలుషితం అవుతుందని, రోగాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రజల అభిప్రాయం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రాజెక్ట్ను అక్కడ ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు.డంపింగ్ యార్డ్ అంశంలో తాను రాజీ పడనని చెప్పిన నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టి సీబీసీఐడీ కేసులతో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానని, ఎలాంటి ఒత్తిడులకు లొంగబోనని స్పష్టం చేశారు.ఈ అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రజలంతా ఒక్కటై డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.డంపింగ్ యార్డ్ రద్దే లక్ష్యంగా ఈ నెల 22న పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, గందె శ్రీనివాస్, పింగిల్ రమేష్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.












