-వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్పై ఐక్యత అవసరం
అఖిలపక్ష కమిటీ పిలుపు….
– 35 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు…
హుజురాబాద్/ ఏప్రిల్ 26 (మా అక్షరం): మండల పరిధిలోని సిర్సపెల్లి మధ్య ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ (WTE) ప్లాంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా నిరవధిక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమంలో స్థానిక ప్రజలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, వ్యాపార–వాణిజ్య సంఘాలు, ప్రెస్ క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎల్ఐసీ ఏజెంట్ల అసోసియేషన్, వికలాంగుల సంక్షేమ సంఘం తదితర సంస్థలు పాల్గొంటున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడం, మరికొన్ని పార్టీలు విడివిడిగా ఉద్యమాలు చేపట్టడం వల్ల సమస్య పరిష్కారం ఆలస్యమవుతోందని అఖిలపక్ష కమిటీ పేర్కొంది. ప్రజా ఉద్యమాలను బలహీనపరిచే ఈ పరిస్థితిని నివారించాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది.ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలను రక్షించే బాధ్యత తీసుకోవాలని కమిటీ కోరింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్), బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ వంటి అన్ని పార్టీలు అఖిలపక్ష కమిటీతో కలిసి ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.డంపింగ్ యార్డు (WTE ప్లాంట్) రద్దు అయ్యే వరకు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కమిటీ హెచ్చరించింది.













