హుజురాబాద్/ ఏప్రిల్ 29 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రతి వార్డులో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.బీజేపీ నేతలు మాట్లాడుతూ…. సిర్సపల్లి శివారులో దాదాపు 125 ఎకరాల్లో డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రాంతాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నాలుగు జిల్లాల చెత్తను హుజురాబాద్కు తరలించడం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎలా జీవిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ప్రజలు డంపింగ్ యార్డ్ వద్దని నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుపై చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయాలని బీజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మండల అధ్యక్షుడు పారుపల్లి కొండాల్ రెడ్డి, ముప్పు మహేష్, నర్రా శ్రీనివాస్ రెడ్డి, నరెడ్ల చైతన్య రెడ్డి, రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకట్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













