హుజూరాబాద్/ మే 07 (మా అక్షరం):పట్టణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కోతుల సమస్యకు చెక్ పెట్టేందుకు హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కోతులను పట్టే ప్రత్యేక బృందాలను తీసుకువచ్చి గురువారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 70 నుంచి 80 వరకు కోతులను బోన్లలో బంధించారు.గత కొంతకాలంగా హుజూరాబాద్ పట్టణంలోని కాలనీలు, ప్రధాన వీధులు, మార్కెట్ ప్రాంతాల్లో కోతుల సంచారం అధికమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం, చిన్నారులు, వృద్ధులను భయాందోళనలకు గురిచేయడం వంటి ఘటనలు పెరుగుతుండటంతో స్థానికులు పలుమార్లు మున్సిపాలిటీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రెంటాల సుహాసిని ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టి కోతులను పట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బృందాలు పలు కాలనీల్లో బోన్లు ఏర్పాటు చేసి కోతులను సురక్షితంగా పట్టుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రెంటాల సుహాసిని మాట్లాడుతూ… పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కోతుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టుకున్న కోతులను అటవీ ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు.












