హుజురాబాద్/ఆగస్టు13(మా అక్షరం): హుజురాబాద్ నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాల పరిస్థితులపై తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు (గురువారం) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనుంది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ నేతృత్వంలో హుజురాబాద్, రాంపూర్, కమలాపూర్, జమ్మికుంట ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాలను బృందం సందర్శించనుంది.ఈ సందర్భంగా చేనేత కార్మికుల స్థితిగతులు, సహకార సంఘాల్లో వస్త్ర ఉత్పత్తి, నిల్వలు, త్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు, నేతన్న బీమా, నేతన్న భరోసా, చేనేత మిత్ర, జియో ట్యాగింగ్ విధానం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి అధ్యయనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పర్యటనలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు వేముల ఉమారాణి, జిల్లా కమిటీ అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంచికట్ల కోటేశ్వర్, రాష్ట్ర కమిటీ కార్యదర్శులు గాజుల భగవాన్నేత, కుడికాల సాయి, గాజుల అరుణ, జడల అశోక్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బింగి రాణి, వేముల రమ్య, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కందికట్ల పద్మ తదితరులు పాల్గొననున్నారు.చేనేత సంఘాల కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.













