ఎమ్మెల్యేపై అభిమానం చాటిన గురుకుల విద్యార్థులు
కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 10(మాఅక్షరం):తిమ్మాపూర్ లోని జ్యోతీరావు ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిమ్మాపూర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నింటిని ఎమ్మెల్యే తీర్చడమే వారి అభిమానానికి కారణం. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పించడంతో ఎమ్మెల్యే సార్ అనే ఆంగ్ల అక్షరాల మాదిరిగా విద్యార్థులు ఏకరూపు దుస్తులతో కూర్చొని తమ అభిమానాన్ని అక్షరాల రూపంలో చాటుకున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే తిమ్మాపూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. తొలిసారిగా పాఠశాలను సందర్శించినప్పుడు దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నింటిని తీర్చారు. పాఠశాల ఆవరణలో పాడుబడ్డ బావిని పూడ్చివేయించారు. పాఠశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు,ముళ్ల చెట్లను తొలగించారు. మొరం పోయించి రోడ్డు బాగు చేయించారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇటీవల గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ప్రత్యేక చొరవ చూపడంతో పాటు పాఠశాలకు అదనపు వసతులు సమకూర్చారు.దీంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.











