కాట్రపల్లి గ్రామంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి
– గ్రామస్తుల ఆందోళన…
హుజురాబాద్/ ఏప్రిల్ 13 (మా అక్షరం): మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని పోచమ్మవాడ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి జరిగింది. స్థానికుడు బాణాల హరీష్ బీర్భూమికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఎలుగుబంటిని గమనించిన హరీష్, సాహసోపేతంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఎలుగుబంటి అతని భుజంపై దాడి చేసి గాయపరిచింది. దాడిని అడ్డుకునే క్రమంలో అతని రెండు చేతి వేళ్ళు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఇటీవల కొన్ని రోజులుగా గ్రామంలో ఎలుగుబంటి సంచారం జరుగుతున్నట్లు గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు రెండు సార్లు సమాచారం అందించినా, వారు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలు బయట ఆడుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంతో ఎలుగుబంటి దాడులకు గురయ్యే ప్రమాదం పెరిగినందున, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎలుగుబంటిని బంధించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.











