–కమిషనర్ సమ్మయ్యకు స్థానికుల మద్ధతు
ఇందిరానగర్ డ్రైనేజీ అభివృద్ధికి ఆయన కృషి ప్రశంసనీయం..
-అవినీతి ఆరోపణలు అభివృద్ధికి అడ్డుగోలు ప్రయత్నం చందమల్ల బాబు…
హుజూరాబాద్ జూలై 01 (మా అక్షరం):హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు – ఇందిరానగర్ ఎస్సీ కాలనీలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనుల నేపథ్యంలో,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను స్థానికులు తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని, అభివృద్ధి పనులకు అడ్డుపడే కుట్రగా పేర్కొన్నారు. కమిషనర్కు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చందమల్ల బాబు మాట్లాడుతూ,ఇందిరానగర్ ప్రాంతంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కమిషనర్ సమ్మయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డ్రైనేజీ పనులకు ప్రారంభం పెట్టేలా చేశారు. గతంలో ఎన్నిసార్లు అధికారులను కోరినప్పటికీ స్పందన రాలేదు. కానీ సమ్మయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అని అన్నారు.ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు, కమిషనర్ సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించి, సిక్కువాడ నుండి ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ వరకు డ్రైనేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. సంబంధిత కాంట్రాక్టర్కు ఎల్.ఓ.సీ (లెటర్ ఆఫ్ కమిట్మెంట్) కూడా జారీ చేసినట్టు స్థానికులు వెల్లడించారు.ఈ నేపథ్యంలోని వేళ, అభివృద్ధి పనులకు ఊపొస్తున్న సమయంలో కమిషనర్పై అవాస్తవ ఆరోపణలు చేయడం దారుణమని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న కుట్రలను బయటపెట్టాలని, అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.











