-బండి సంజయ్ విజ్ఞప్తి ఫలితం…
– జమ్మికుంటలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి...
కరీంనగర్ /సెప్టెంబర్ 03 (మా అక్షరం):
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఇకపై జమ్మికుంట రైల్వే స్టేషన్లో దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12721) జమ్మికుంటకు రాత్రి 1.34 గంటలకు చేరుకొని, ఒక నిమిషం తరువాత బయలుదేరుతుంది. అదే రైలు నిజాముద్దీన్ నుండి హైదరాబాద్కు (12722) తిరిగి వస్తూ రాత్రి 11.19 గంటలకు జమ్మికుంటలో ఆగనుంది. ఇక సికింద్రాబాద్–రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12771) రాత్రి 1.04 గంటలకు జమ్మికుంటకు చేరుకొని, ఒక నిమిషం తరువాత బయలుదేరనుంది. ఈ రైళ్లు ఏ తేదీ నుండి జమ్మికుంటలో ఆగనున్నాయో దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.గత కొన్నేళ్లుగా జమ్మికుంటలో రైళ్లు ఆగాలని స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పలుమార్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులను, కేంద్ర రైల్వే మంత్రిని కలిసినట్లు సమాచారం. తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి జమ్మికుంటలో రైళ్లను ఆపే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.రైల్వే శాఖ నిర్ణయంపై కృతజ్ఞతలు వ్యక్తం చేసిన బండి సంజయ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రయాణీకులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.











