-బీసీల హక్కుల కోసం గడపగడపకూ పోరాటం….
కరీంనగర్/ సెప్టెంబర్ 14 (మా అక్షరం):బీసీల బావాజాలాన్ని గ్రామ గ్రామాన, గడపగడపకు తీసుకువెళ్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, సబ్బని వెంకట్ అన్నారు. పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, విశిష్ట అతిథిగా సబ్బని వెంకట్ హాజరై బీసీలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 75 ఏళ్లుగా బీసీలు ఎంతో నష్టపోతున్నారని, ఇకనైనా మేల్కొని తమ హక్కులను సాధించుకోవడానికి ఆత్మన్యూనత భావం వదిలి చైతన్యంతో పోరాడవలసిన అవసరం ఉందన్నారు. బీసీలలో చైతన్యం నింపేందుకు తాము పుస్తకాలు, వ్యాసాలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామ గ్రామాన బీసీ బావాజాలాన్ని తీసుకువెళ్తున్నామని తెలిపారు.హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన సమావేశంలో కులగణన చేయాలనే డిమాండ్పై ప్రభుత్వం తలొగ్గిందని, ఇదే తరహాలో 42% రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమం కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
సబ్బని వెంకట్ మాట్లాడుతూ… ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రి అవడం వల్ల బీసీలందరికీ న్యాయం జరగదని, మారుమూల పల్లెల్లోనూ బీసీ నాయకులకు పదవులు దక్కితేనే నిజమైన న్యాయం అవుతుందని అన్నారు. 42% రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే పార్టీలను నమ్మగలమని స్పష్టం చేశారు. కేటీఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇచ్చి బీసీ సభలు నిర్వహిస్తేనే బీసీల నమ్మకం పెరుగుతుందని చురకలు అంటించారు.ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉరుమల్ల విశ్వం, ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బిసిఐఎఫ్ జిల్లా నాయకులు ఇప్పనపెల్లి సాంబాన్తో పాటు సుమారు వెయ్యి మంది బీసీ మేధావులు తదితరులు పాల్గొన్నారు.











