హుజురాబాద్/ అక్టోబర్ 16 (మా అక్షరం): పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేశారు. గురువారం జరిగిన ఆకస్మిక దాడుల్లో దాదాపు 298 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే …పట్టణంలోని బాలాజీ ట్రేడర్స్ అనే దుకాణంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించి, సాక్ష్యాధారాలతో పాటు పంచనామా నమోదు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు.తదనంతరం, విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. అధికారులు బియ్యాన్ని హుజురాబాద్ మండల లెవల్ స్టాకింగ్ పాయింట్ (ఎంఎల్ఎస్ పాయింట్) కు తరలించారు.అక్రమ నిల్వల వెనుక ఉన్న వ్యక్తులు లేదా వ్యాపార సంస్థపై పౌర సరఫరాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.











