-హుజురాబాద్లో వైభవంగా ప్రారంభమైన జాతర…
-గద్దెపై కొలువుదీరిన సారలమ్మ….
హుజురాబాద్ /జనవరి 29 (మా అక్షరం):
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతర హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరలో అత్యంత కీలకమైన తొలి ఘట్టం బుధవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ముగిసింది.ఘనంగా సారలమ్మ రాక
పట్టణంలోని తెనుగువాడ నుంచి సారలమ్మను పూజారులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా రంగనాయకుల గుట్టకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
గద్దెపై సారలమ్మను కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు అమ్మవారికి నీరాజనాలు పలికారు.చివరగా రంగనాయకుల గుట్ట వద్ద ఉన్న గద్దెపై సారలమ్మను ప్రతిష్ఠించడంతో, దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.











