హుజురాబాద్/ ఏప్రిల్ 01 (మా అక్షరం): పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు.
పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారే డంపింగ్ యార్డ్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిర్వాహకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.













