హుజూరాబాద్/ ఏప్రిల్ 04 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి సమీపంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.జనావాసాల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరికాదని, దీనివల్ల ప్రజలతో పాటు వన్యప్రాణులకు కూడా హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు.హుజూరాబాద్ ప్రజలు చేపట్టిన ఆందోళనకు బీజేపీ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.సీఎంకు చిత్తశుద్ధి ఉంటే డంపింగ్ యార్డ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో “6 గ్యారంటీలు” అమలు చేశామని చెప్పడం తప్పుదారి పట్టించే ప్రకటన అని పేర్కొన్నారు.6 గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు సవాల్ విసురుతూ, కేరళ మీడియాను తీసుకుని తెలంగాణలో పర్యటిద్దామని అన్నారు. అమలు చేసినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు.మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీ, ఆసరా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, కౌలు రైతులు–రైతు కూలీలకు రైతు భరోసా వంటి హామీలు అమలు కాలేదని తాను నిరూపిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి తన ఆరోపణలను తప్పు అని నిరూపించగలిగితే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని వ్యాఖ్యానించారు.కేరళలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా స్పందిస్తూ, అక్కడి ప్రజలు మరియు మీడియా తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయన సూచించారు.













