హుజురాబాద్/ ఏప్రిల్ 19 (మా అక్షరం): మండలంలోని సిరిసపల్లి గ్రామ చివరలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ రద్దు చేయాలంటూ హుజురాబాద్ యువత ఆదివారం ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.నిరసనల 28వ రోజు సందర్భంగా యువత, సోషల్ మీడియా యాక్టివిస్టులు జేఏసీ దీక్ష శిబిరంలో పాల్గొన్నారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు. వెంటనే డంపింగ్ యార్డ్ను హుజురాబాద్ నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని పట్టణవాసులు డిమాండ్ చేశారు.సస్యశ్యామలంగా ఉన్న హుజురాబాద్ను కాలుష్య కేంద్రంగా మార్చవద్దని, నివాసాలకు అనువైన ఈ భూమిని చెత్త కుప్పలుగా మార్చకూడదని వారు కోరారు.శాంతియుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోయల్కర్ శ్యామ్, తాటిపాముల రాము, పిట్టల శ్రీనివాస్, రియాజ్, సూర్యకిరణ్ కొలుగూరి, కాసగోని కిరణ్, ఫయాజ్, బాబా, భాస్కర్, రాజీవ్, కందుల స్వామి పటేల్, నరేందర్, శ్రీనివాస్, రామాంజనేయులు, ఆర్. అనిల్, మోతె స్వామి, రాంపూర్ ఉప సర్పంచ్ శివాజీ, యూట్యూబ్ డిజిటల్ క్రియేటర్ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.












