హుజూరాబాద్/ ఆగస్టు 05 (మా అక్షరం): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 12, 13, 14, 18, 20, 22, 23, 25, 28 వార్డుల్లో 31 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. వార్డుల్లో పర్యటించే సమయంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెక్కులు అందుకున్న పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి గురికాగా, వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధులు, పట్టణ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, సేవాదళ్, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.













