హుజూరాబాద్ ఆగస్టు 6 (మా అక్షరం): బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి పురస్కరించుకొని గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి దశ ఉద్యమానికి పునాది వేసి, మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన ‘నీళ్లు–నిధులు–నియామకాలు’ సిద్ధాంతమే తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు. జయశంకర్ ఆశయాలకు ఆకర్షితులై ఎందరో ఉద్యమంలో పాల్గొనగా, అనేక మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పూలే కమిటీ అధ్యక్షుడు చెల్లూరి రఘుచారి, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, జాతీయ బీసీ సంక్షేమ హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతికుమార్, సొల్లు శంకర్, తిప్పారపు భువనచంద్ర, ఎస్. సృజన, కాలేశ్వరం సాల్మన్, పోతారపు అశోక్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.













