హుజురాబాద్/ ఆగస్టు 11 (మా అక్షరం): హుజురాబాద్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశాన్ని వివిధ పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు బహిష్కరించారు. గత సమావేశాల్లో ఆమోదించిన పలు తీర్మానాలు ఇప్పటివరకు అమలు కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణంలోని అభివృద్ధి పనులు, పారిశుధ్యం, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ ఏకపక్షంగా అజెండా రూపొందించి పంపించడం సరికాదని కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పట్టణంలో అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు బహిష్కరించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తాం.. అవసరమైతే పోరాడుతాం.. హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడతాం అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు.













